ఇరాన్‌ నన్ను హత్య చేయాలని చూస్తోంది: ట్రంప్‌ సంచలన ఆరోపణలు

  • ఇరాన్‌ మొదటి టార్గెట్‌ తానేనన్న ట్రంప్‌
  • 47 ఏళ్లుగా ఇరాన్‌ వైఖరి మారలేదన్న అమెరికా అధ్యక్షుడు
  • ప్రస్తుత నాయకత్వం కాస్త హేతుబద్ధంగా ఉందని వ్యాఖ్య
  • ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరిక
  • చర్చలు జరిపి సమయం వృథా అని వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నే అవకాశం ఉందని, తాను వారి ‘నంబర్‌-1 టార్గెట్‌’నని అన్నారు. అంకారాలో జరుగుతున్న నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత 47 ఏళ్లుగా ఇరాన్‌ అదే విధమైన వైఖరిని కొనసాగిస్తోందన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న నాయకత్వం గతంతో పోలిస్తే కొంత హేతుబద్ధంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలు ఇక ప్రయోజనం లేవని ట్రంప్‌ స్పష్టం చేశారు. ‘‘ఈ రాత్రే ఇరాన్‌పై మళ్లీ తీవ్ర దాడులు చేస్తాం. వారు రోజూ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు’’ అని హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చర్చలు కొనసాగించాలని చర్చల బృందం భావిస్తే కొనసాగించవచ్చని, కానీ వాటిపై తనకు నమ్మకం లేదన్నారు.

మరోవైపు, అమెరికా బుధవారం జరిపిన వైమానిక దాడుల్లో తమ సైన్యానికి చెందిన ఎనిమిది మంది సైనికులు మరణించినట్లు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దక్షిణ ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌, బుషెహర్‌ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని పేర్కొంది. అమెరికా ఏకపక్ష దాడులతో ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని ఇరాన్‌ విదేశాంగ శాఖ ఆరోపించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Donald Trump
Iran
Assassination threat
NATO Summit Ankara
US Iran tensions
US airstrikes

More Telugu News